Smriti Irani: ఆ ద్వేషంతోనే 18 ఏళ్ల నా కూతురిపై ఆరోపణలా.. స్మృతి ఇరానీ ఎమోషనల్

23 Jul, 2022 18:07 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే అభం శుభం తెలియని తన కూతురిని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తరచూ విమర్శిస్తున్నందుకు 18 ఏళ్ల తన కూతురు గోవాలో అక్రమంగా బార్‌ నడుపుతోందనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కూతురు కావడమే ఆమె శాపమా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమోషనల్ అయ్యారు.

'18 ఏళ్ల నా కూతురి వ్యక్తిత్వాన్ని కూనీ చేయాలని ఇద్దరు కాంగ్రెస్ నేతలు లక్ష‍్యంగా పెట్టుకున్నారు. నా కూతురు కాలేజీలో చదువుకుంటోంది. ఎలాంటి బార్ నడపటం లేదు. కావాలంటే పేపర్లు చూసుకోండి. ఆమె పేరు ఎక్కడుంది?  నేను రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తున్నందు వల్లే నా కూతురిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.  నా కుమార్తె రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ విద్యార్థిని.' అని స్మృతి ఇరానీ తెలిపారు.

ఈ విషయంపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. వారికి ఈరోజే నోటీసులు పంపిస్తానని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీని అమెథీకి పంపాలని, మరోసారి ఓడిస్తానని సవాల్ విసిరారు.

కాగా అంతకుముందు స్మృతీ ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ గోవాలో రెస్టారెంట్ నడుపుతున్నారని, అందులో ఫేక్ లైసెన్స్‌తో బార్ కూడా ఉందని కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా ఆరోపించారు. మోదీ ప్రభుత్వం స్మృతి ఇరానీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను జోయిష్ ఇరానీ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. అవి నిరాధారమైనవని, స్మృతి ఇరానీ కూతురు అయినందువల్లే ఆమెపై రాజకీయ దురుద్దేశంతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
చదవండి: ఎన్‌డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాహుల్‌.. కేంద్రంపై ఫైర్‌

మరిన్ని వార్తలు