తండ్రిని కాటికి పంపిన పురంధేశ్వరికి పార్టీలు మారడం ఒక లెక్కా: ఎంపీ విజయసాయిరెడ్డి 

6 Nov, 2023 12:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. పురంధేశ్వరి ఎఫెక్ట్‌తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డారంటూ ఎద్దేవా చేశారు. అలాగే, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర రావులే అని అన్నారు. 

కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చూడు చిన్నమ్మా.. పున్నమ్మా.. పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్‌గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా మిమ్మల్ని తీసేసారు. దీంతో కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే.. మీ ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పాపం! రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్‌ కాలమే సమాధానం చెబుతుంది.

అలాగే, దివంగత సీనియర్‌ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురంధేశ్వరిది. సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబు ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. "అన్న టీడీపీ" అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్‌లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు పురంధేశ్వరి. 

నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో  ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ అధ్యక్షురాలివా.. బాబుకు తొత్తువా? 

మరిన్ని వార్తలు