సిరిసిల్ల/వేములవాడ:జిల్లా వ్యాప్తంగా బుధవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో నాలుగు, వేములవాడ నియోజకవర్గంలో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. సిరిసిల్లలో.. కాంగ్రెస్ అభ్యర్థి కె.కె.మహేందర్రెడ్డి తరఫున ఆ పార్టీ నాయకులు కాముని వనిత, మడుపు శ్రీదేవి, ఆకునూరి బాలరాజు, వైద్యశివప్రసాద్, మ్యాన ప్రసాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.ఆనంద్కుమార్కు నామినేషన్ పత్రాన్ని అందించారు. బీజేపీ అభ్యర్థి రాణీరుద్రమారెడ్డి తరఫున ఆ పార్టీ నాయకులు ఆడెపు రవీందర్, బొల్గం నాగరాజు, గూడూరి భాస్కర్, చీటి కమలాకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా లగిశెట్టి శ్రీనివాస్, తాటిపాముల శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. స్వత్రంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. సిరిసిల్లలో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి స్వత్రంత్ర అభ్యర్థిగా మహమ్మద్ నజీర్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా గడ్డం హరీశ్, బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ తరఫున మహమ్మద్ ఇక్బాల్ నామినేషన్లు దాఖలు చేశారు.