#AjinkyaRahane: 'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం'.. రహానే భార్య ఎమోషనల్‌

10 Jun, 2023 15:54 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియనషిప్‌ ఫైనల్లో టీమిండియా స్టార్‌ బ్యటర్లంతా మూకుమ్మడిగా విఫలమైన చోట అజింక్యా రహానే ఒక్కడే పోరాడాడు. లార్డ్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సహాయంతో టీమిండియాను ఫాలోఆన్‌ గండం నుంచి బయటపడేశాడు. 512 రోజుల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆసీస్‌ బౌలర్ల నుంచి బులెట్‌లా దూసుకొస్తున్న బంతులు రహానేను పలుమార్లు గాయపరిచాయి.

అయినా రహానే ఏమాత్రం బెదరకుండా తన ఆటను కొనసాగించాడు. సెంచరీ చేయకపోయినప్పటికి 129 బంతుల్లో 89 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. రహానే చేసిన పోరాటానికైనా టీమిండియా మ్యాచ్‌ గెలవాలని కోరుకుందాం. ఒకవేళ టీమిండియా ఓడినా రహానే ఇన్నింగ్స్‌ మాత్రం గుర్తుండిపోతుంది.

రహానే స్పూర్తిదాయక ఇన్నింగ్స్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ.. అతని భార్య రాధికా దొపోవ్‌కర్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన భర్త ఆటతీరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.  

''పలుమార్లు వేలికి గాయాలు అయినా స్కాన్‌ చేయించుకోవడానికి నిరాకరించి పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు. ఆట పట్ల మీకున్న అంకితభావానికి హ్యాట్సాఫ్‌. మీ నిస్వార్థత, సంకల్పబలం చాలా గొప్పది.. ఈ రెండింటిని ఒక అంశంలో జోడించి ఇవాళ బ్యాటింగ్‌ చేసి అందరిలో స్పూర్తి నింపారు. జట్టును గెలిపించడంకోసం మీరు ప్రదర్శించిన స్పిరిట్‌కు గర్విస్తున్నా.. మై రీసైలెంట్‌ పార్టనర్‌.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా'' అంటూ రాసుకొచ్చింది.

A post shared by Radhika Rahane (@radhika_dhopavkar)

కాగా మూడోరోజు ఆట ముగిసిన తర్వాత రహానే మాట్లాడుతూ.. ''ఈరోజు బ్యాటింగ్‌ చేసిన విధానంపై హ్యాపీగా ఉన్నా. శార్దూల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం ఏర్పడడంతో కనీసం 320 నుంచి 330 పరుగులు చేస్తామనుకున్నాం. కానీ అది జరగలేదు. అయితే మా ప్రదర్శన ఇంతటితో ఆగలేదు.. మ్యాచ్‌ గెలిచేందుకు పోరాడుతాం. నాలుగోరోజు ఉదయం సెషన్‌ మాకు కీలకం. జడేజా బౌలింగ్‌ బాగుంది. అతను కీలకంగా మారే అవకాశం ఉంది. సీమ్‌ బౌలర్స్‌ కూడా సహకరించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: రీఎంట్రీలో ఆపద్భాందవుడి పాత్ర.. భారత్‌ తరపున తొలి బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు