Rohit Sharma: ఆ ముచ్చట తీరకుండా, ఎన్ని సెంచరీలు చేసి ఏం లాభం..!

5 Nov, 2021 17:47 IST|Sakshi

Runs And Hundreds With Out Winning Trophy Mean Nothing Says Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా నవంబర్‌ 5న స్కాట్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు ఐసీసీ సోషల్ మీడియా టీమ్‌తో మాట్లాడిన టీమిండియా స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు టైటిల్‌ నెగ్గకుండా.. ఆటగాళ్లు ఎన్ని శతకాలు బాదినా, ఎన్ని పరుగులు చేసినా ఉపయోగం లేదని అభిప్రాయపడ్డాడు. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న క‌న్నా.. టీమ్ వ‌ర్క్ ముఖ్య‌మ‌ని పేర్కొన్నాడు. 2016 తర్వాత తన బ్యాటింగ్‌ సరళి మారిందని, ఈ మధ్యకాలంలో చాలా అనుభ‌వాన్ని గ‌డించాన‌ని, బ్యాట‌ర్‌గా ప‌రిణితి సాధించానని  తెలిపాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో ఓపెనర్‌గా ప్రమోట్‌ కావడమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. 

ఈ స్థానంలో బరిలోకి దిగితే ఎక్కువ బంతులను ఎదుర్కొనే అవ‌కాశం ఉంటుంద‌ని, దాని వ‌ల్ల ఎక్కువ పరుగులు వ‌స్తాయ‌ని అన్నాడు. అధిక శతకాలు బాదే వారిలో ఎక్కువ శాతం మంది టాప్ ఆర్డ‌ర్ బ్యాటర్లే ఉంటార‌ని ఉదహరించాడు. 2019 వన్డే ప్రపంచకప్ వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ప్ర‌త్యేక‌మైంద‌ని, ఆ టోర్నీలో వీలైన‌న్ని పరుగులు, సెంచరీలు చేసినప్పటికీ ట్రోఫీ గెల‌వ‌కపోవడం బాధించిందని పేర్కొన్నాడు. 

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ముచ్చట(ప్రపంచకప్‌ గెలవడం) తీరకుండా, ఎన్ని సెంచరీలు చేసి ఏం లాభం అని రోహిత్‌ అన్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా రెండు వరుస పరాజయాలతో సెమీస్‌ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అఫ్గాన్‌పై భారీ విజయం సాధించడంతో టీమిండియా సెమీస్‌ ఆశలు సజీవంగా మారాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ కీలక ఇన్నింగ్స్‌(74) ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు.
చదవండి: Rahul Dravid: టీమిండియా కెప్టెన్‌గా అతనే నా ఫస్ట్‌ ఛాయిస్‌..

మరిన్ని వార్తలు