టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు

6 Feb, 2024 19:45 IST|Sakshi

భారత జాతీయ జట్టు హాకీ ప్లేయర్‌ వరుణ్‌ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 22 ఏళ్ల అమ్మాయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుణ్‌పై కేసు నమోదు చేశారు.

2018లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన వరుణ్‌.. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను మైనర్‌నని (17 ఏళ్లు).. వరుణ్‌ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్‌ ఇండియాలో శిక్షణలో ఉన్నాడని యువతి ఫిర్యాదులో ప్రస్తావించింది. 

యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వరుణ్‌ కోసం గాలిస్తున్నారు. వరుణ్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు కాకముందు వరకు వరుణ్‌ భువనేశ్వర్‌లోని జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్నట్లు తెలుస్తుంది. 

28 ఏళ్ల వరుణ్‌ కుమార్‌ భారత జాతీయ జట్టు తరఫున డిఫెండర్‌ స్థానంలో ఆడతాడు. 2017 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో స్టాండ్‌బై సభ్యుడిగా ఉన్నాడు. జూనియర్‌ స్థాయి నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్‌.. హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్‌ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా తరఫున 142 మ్యాచ్‌లు ఆడిన వరుణ్‌ మొత్తం 40 గోల్స్‌ చేశాడు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega