Ind vs Eng: టీమిండియా గెలిచింది... కానీ అదొక్కటే సమస్య! | Ind Vs Eng: Zaheer Khan Exposes India's Batting Weaknesses, Says Lot Of Work To Be Done - Sakshi
Sakshi News home page

Ind vs Eng: గెలిచినందుకు సంతోషం.. అదొక్కటే సమస్య: భారత మాజీ బౌలర్‌ వార్నింగ్‌

Published Tue, Feb 6 2024 5:01 PM

Ind vs Eng Lot Of Work To Done Zaheer Khan Exposes India Batting Weakness - Sakshi

India vs England, 2nd Test: ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో గెలుపొంది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమిండియా. విశాఖపట్నం మ్యాచ్‌ను విజయంతో ముగించి.. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. దీంతో టీమిండియాకు కాస్త ఊరట లభించినట్లయింది.

అయితే, రెండో టెస్టులో గెలుపుతో జోరు మీదున్న రోహిత్‌ సేన తదుపరి మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడాలని భారత మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ హెచ్చరించాడు. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ వైఫల్యం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు.

గెలిచాం కానీ.. అదొక్కటే ఆందోళనకరం
ఈ మేరకు జియో సినిమా షోలో భాగంగా రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరును విశ్లేషిస్తూ.. ‘‘సిరీస్‌లో అప్పటికే ఒక మ్యాచ్‌ ఓడి వెనుకబడి ఉన్నపుడు... దానిని కచ్చితంగా 1-1తో సమం చేయాలనే కసి, దూకుడు కనిపించాలి.

నాకు తెలిసి ప్రతి ఒక్క ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకు రోహిత్‌ కృషి చేశాడు. అయితే, మన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇలాంటి పిచ్‌ల మీద.. మనవాళ్లు ఇంతకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా బ్యాటింగ్‌ చేయడం మనం చూశాం.

ఇంగ్లండ్‌ సమిష్టిగా ఆడింది
నిజానికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్‌ చేసింది. కేవలం ఒక్క ఆటగాడు మాత్రమే అర్ధ శతకం బాదినా.. 300 పరుగుల స్కోరుకు చేరువైంది. జట్టుగా ఆడటం వల్ల వచ్చిన ఫలితం అది.

అయితే, టీమిండియా తరఫున రెండు అద్భుతమైన ఇన్నింగ్స్‌ చూడటం మనకు భారీ ఊరటనిచ్చే అంశం. యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడారు. ఏదేమైనా మన బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని జహీర్‌ ఖాన్‌ విమర్శించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ(209)తో మెరవగా.. శుబ్‌మన్‌ గిల్‌ శతకం(104) బాదాడు. ఇక టీమిండియా ఇంగ్లండ్‌ మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఇందుకు వేదిక.

టీమిండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో టెస్టు
►టీమిండియా స్కోరు(తొలి ఇన్నింగ్స్‌): 396-10 (112 ఓవర్లలో)
►ఇంగ్లండ్‌ స్కోరు(తొలి ఇన్నింగ్స్‌): 253-10 (55.5 ఓవర్లలో)
►టీమిండియా స్కోరు(రెండో ఇన్నింగ్స్‌): 255-10 (78.3 ఓవర్లలో)
►ఇంగ్లండ్‌ విజయ లక్ష్యం: 399 రన్స్‌
►లక్ష్యాన్ని ఛేదించలేక 292 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఆలౌట్‌
►విజేత: 106 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా

చదవండి: Ind vs Eng: అలాంటి పిచ్‌లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్‌ కౌంటర్‌!

Advertisement
Advertisement