Ashes 2021- 22: సిడ్నీ టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు ఇదే.. రెండేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ!

4 Jan, 2022 10:54 IST|Sakshi
PC: Cricket Australia

Australia Playing XI For Sydney Test: ఏకపక్ష విజయాలతో ఇప్పటికే యాషెస్‌ సిరీస్‌ సొంతం చేసుకుని జోరు మీదున్న ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాలుగో మ్యాచ్‌కు తమ తుదిజట్టును ప్రకటించింది. మూడో టెస్టుతో అరంగేట్రం చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన స్కాట్‌ బోలాండ్‌ స్థానం నిలుపుకోగా.. ట్రవిస్‌ హెడ్‌ స్థానాన్ని ఉస్మాన్‌ ఖావాజాతో భర్తీ చేశారు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత ఖవాజా పునరాగమనం చేయనున్నాడు.

ఈ విషయాల గురించి కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ... గాయం కారణంగా జట్టుకు దూరమైన జోష్‌ హాజిల్‌వుడ్‌ ఇంకా కోలుకోలేదని పేర్కొన్నాడు.హోబర్ట్‌ టెస్టుకు అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అదే విధంగా స్కాటీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని... అతడిని జట్టులో కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. కాగా జనవరి 5 నుంచి ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు మొదలు కానుంది. సిరీస్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ట్రవిస్‌ హెడ్‌ కరోనా సోకిన కారణంగా  జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడింట గెలిచి ఆతిథ్య ఆస్ట్రేలియా 3-0తో ట్రోఫీని కైవసం చేసుకుంది.

యాషెస్‌ సిరీస్‌- నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు:
మార్కస్‌ హారిస్‌,  డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ఉస్మాన్‌ ఖవాజా, కామెరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ(వికెట్‌ కీపర్‌), ప్యాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియాన్‌, స్కాట్‌ బోలాండ్‌.

చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్‌.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్‌ చేసిన ధావన్‌

>
మరిన్ని వార్తలు