CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?

15 Nov, 2023 12:30 IST|Sakshi

వర్షం కారణంగా వరల్డ్‌కప్‌ 2023 సెమీఫైనల్‌ మ్యాచ్‌లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్‌ 16న జరిగే రెండో సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది.

ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌ మ్యాచ్‌ రద్దైతే, ఆ మరుసటి రోజు (నవంబర్‌ 17, రిజర్వ్‌ డే) మ్యాచ్‌ను జరిపిస్తారు. ఇక ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ సాధ్యపడకపోతే మాత్రం లీగ్‌ దశలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ లెక్కన లీగ్‌ దశలో సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉంది కాబట్టి సఫారీలు సెమీస్‌ గండాన్ని గట్టెక్కి ఫైనల్లోకి ప్రవేశిస్తారు.

మరోవైపు ఇవాళ (నవంబర్‌ 15) జరగాల్సిన భారత్‌-న్యూజిలాండ్‌ తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రెండు రోజులు (రిజర్వ్‌ డే) సాధ్యపడకపోతే అప్పుడు లీగ్‌ దశలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన భారత్‌ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా రెండు సెమీస్‌ మ్యాచ్‌లు రద్దైతే భారత్‌-సౌతాఫ్రికా ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి.

ఈ అంశం చర్చించుకోవడానికి బాగానే ఉంది కానీ, జరిగే పని మాత్రం కాదు. ఒకవేళ వర్షం కారణంగా షెడ్యూల్‌ అయిన రోజు మ్యాచ్‌ జరగకపోయినా, రిజర్వ్‌ డే రోజైనా తప్పక జరిగే అవకాశం ఉంటుంది. భారత్‌లో ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎన్ని అల్పపీడనాలు ఏర్పడినా వాటి ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. 


 

మరిన్ని వార్తలు