భారత్‌ 377/8 డిక్లేర్డ్‌.. రాణించిన దీప్తి శర్మ

3 Oct, 2021 05:33 IST|Sakshi

గోల్డ్‌కోస్ట్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘పింక్‌ బాల్‌’ టెస్టులో భారత్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 276/5తో శనివారం ఆటను కొనసాగించిన భారత మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 145 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఆస్ట్రేలియాపై భారత్‌కిదే అత్యధిక స్కోరు. ఆ్రస్టేలియా గడ్డపై విదేశీ జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ దీప్తి శర్మ (167 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను జులన్‌ గోస్వామి (2/27), పూజా వ్రస్తాకర్‌ (2/31) ఇబ్బంది పెట్టారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేసింది.

ఎలీస్‌ పెర్రీ (27 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), గార్డ్‌నర్‌ (13 బ్యాటింగ్‌; 1 ఫోర్‌) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే ఆ్రస్టేలియా మరో 85 పరుగులు చేయాల్సి ఉంది. నేడు ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్‌ గెలవాలంటే మాత్రం... ఆదివారం జరిగే మూడు సెషన్స్‌లోనూ బౌలర్లు అద్భుతంగా రాణించాలి. తొలి సెషన్‌లో ఆస్ట్రేలియాను 228 పరుగులలోపు ఆలౌట్‌ చేయాలి. అప్పుడు ఆ జట్టు ఫాలోఆన్‌ ఆడే అవకాశం ఉంటుంది. చివరి రెండు సెషన్స్‌లో (దాదాపు 60 ఓవర్లలో) మరోసారి ఆస్ట్రేలియాను 150లోపు ఆలౌట్‌ చేయగలిగితే భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని అందుకోగలదు.

మరిన్ని వార్తలు