రన్నరప్‌ బోపన్న–ఎబ్డెన్‌ జోడీ 

6 Nov, 2023 02:22 IST|Sakshi

పారిస్‌: ఈ ఏడాది మూడో డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ జంట 2–6, 7–5, 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో)–వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఎనిమిది ఏస్‌లు సంధించింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 1,48,760 యూరోల (రూ. కోటీ 32 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్‌ జోడీ ఏడు టోర్నీలలో ఫైనల్‌ చేరి రెండింటిలో టైటిల్‌ సాధించి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. ఈనెల 12 నుంచి 19 వరకు ఇటలీలో జరిగే సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు కూడా బోపన్న–ఎబ్డెన్‌ అర్హత సాధించారు.   

మరిన్ని వార్తలు