Shanghai Masters 2023: రన్నరప్‌గా బోపన్న జోడీ.. ప్రైజ్‌మనీ ఎంతంటే!

16 Oct, 2023 11:40 IST|Sakshi

షాంఘై: ఈ ఏడాది మూడో డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోరీ్నలో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ జంట 7–5, 2–6, 7–10తో గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌)–జెబలాస్‌ (అర్జెంటీనా) ద్వయం చేతిలో ఓడిపోయింది.

రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 2,31,660 డాలర్ల (రూ. కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్‌ పాయింట్లు... టైటిల్‌ నెగ్గిన గ్రానోలెర్స్‌–జెబలాస్‌లకు 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. తాజా ఫలితంతో బోపన్న –ఎబ్డెన్‌ జోడీ టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.    

షాంఘై మాస్టర్స్‌ టోర్నీ విజేత హుర్కాజ్‌ 
పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ హుబెర్ట్‌ హుర్కాజ్‌ తన కెరీర్‌లో రెండో మాస్టర్స్‌ సిరీస్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోరీ్నలో హుర్కాజ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 17వ ర్యాంకర్‌ హుర్కాజ్‌ 6–3, 3–6, 7–6 (10/8)తో ఏడో ర్యాంకర్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)పై గెలిచాడు. విజేత హుర్కాజ్‌కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.  

మరిన్ని వార్తలు