500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం..

18 May, 2021 22:13 IST|Sakshi

లండన్: 146 టెస్టుల్లో 517 వికెట్లు పడగొట్టినా ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌(ఈసీబీ) మాజీ సెలెక్టర్‌ ఎడ్‌ స్మిత్‌ మాత్రం తనను ఓ ఆటగాడిగా గుర్తించలేదని ఇంగ్లండ్‌ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వాపోయాడు. ఇంగ్లండ్ గడ్డపై త్వరలో జరుగనున్న వరుస టెస్ట్‌ సిరీస్‌ల నేపథ్యంలో అతను మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సెలెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తుది జట్టులో తన పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, అతరువాత దానికి కారణాలు తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించాడు. 

టెస్టు ఫార్మాట్‌లో అవకాశం వచ్చినప్పుడల్లా(రొటేషన్‌ పద్ధతి కారణంగా) రాణిస్తున్న నేను సహజంగానే ఉత్తమ జట్టులో ఉంటానని ఆశించానని, కానీ సెలెక్టర్‌ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో తన పేరు లేకపోవడం బాధించిదని ఎడ్‌ స్మిత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. స్మిత్‌ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో రొటేషన్‌ పద్ధతిని చూపిస్తూ తనను ఉద్దేశపూర్వకంగా తప్పించాడని ఆరోపించాడు. త్వరలో జరుగనున్న అన్ని టెస్టుల్లోనూ తనకి ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ వేసవిలో ఇంగ్లండ్‌.. న్యూజిలాండ్, భారత్ జట్లతో మొత్తం ఏడు టెస్టులు ఆడనుంది. 

జూన్ 2న లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు జరగనుండగా.. జూన్ 10న బర్మింగ్‌హామ్‌‌లో రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత భారత్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది. కాగా, ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌కే పరిమితమైన 34 ఏళ్ల బ్రాడ్‌.. 146 టెస్టులు, 121 వన్డేలు, 56 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో అతను సాధించిన మొత్తం వికెట్లలో 10 వికెట్ల మార్క్‌ను 3 సార్లు, ఐదు వికెట్ల మైలురాయిని 18 సార్లు అందుకున్నాడు. అతను టెస్టుల్లో బ్యాట్‌తో కూడా రాణించాడు. అతని కెరీర్‌లో సెంచరీతో పాటు13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 
చదవండి: కలిస్‌, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్‌ శంకర్‌కు చివాట్లు

మరిన్ని వార్తలు