ENG vs NZ 2nd Test: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్‌..

15 Jun, 2022 15:49 IST|Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో సంచలన విజయం సాధించిన ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్‌ ఇచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సహా జట్టులోని సభ్యుల మ్యాచ్‌ ఫీజు నుంచి 40 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) పాయింట్లలో రెండు పాయింట్లు డీమెరిట్‌ చేసింది. ఈ మేరకు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాడు.

నిర్ణీత సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత లక్ష్య చేధనలో రెండు ఓవర్లు తక్కువగా ఉన్నట్లు తేలడంతో ఇంగ్లండ్‌ జట్టుకు స్లో ఓవర్‌-రేట్‌ కింద జరిమానా విధిస్తున్నట్లు తెలిపాడు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌.. ఆర్టికల్‌ 2.22 నిబంధన ప్రకారం స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సహా సిబ్బందికి ఒక ఓవర్‌ చొప్పున  మ్యాచ్‌ ఫీజులో 20 శాతం(రెండు ఓవర్లకు 40 శాతం) కోత విధించామని.. అలాగే ఆర్టికల్‌ 16.11.2 ప్రకారం.. డబ్ల్యూటీసీ పాయింట్ల నుంచి రెండు పాయింట్లు( ఓవర్‌ చొప్పున ఒక పాయింట్‌) డీమెరిట్‌ చేసినట్లు రిఫరీ వెల్లడించారు.

న్యూజిలాండ్‌పై విజయంతో ఇంగ్లండ్‌ ఖాతాలో 42 పాయింట్లు ఉండగా.. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఐసీసీ రెండు పాయింట్లు కోత విధించడంతో 40 పాయింట్లకు తగ్గింది. ఇక పట్టికలో 8వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ పాయింట్‌ పర్సంటేజీ 25 నుంచి 23.80కి తగ్గింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఐదు వికెట్లతో సంచలన విజయం సాధించింది. 299 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి సెషన్‌లో ఇంగ్లండ్‌ విజయానికి 160 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్‌ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. కానీ బెయిర్‌స్టో (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు), స్టోక్స్‌  (75 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ విజయతీరాలకు చేరింది. 

చదవండి: Wasim Jaffer: 'ఏడాది వ్యవధిలో ఎంత మార్పు'.. కొత్త కెప్టెన్‌, కోచ్‌ అడుగుపెట్టిన వేళ

16 ఓవర్లలో 160 పరుగులు.. విధ్వంసానికి పరాకాష్ట.. టెస్టు క్రికెట్‌లో నయా రికార్డు 

మరిన్ని వార్తలు