Wrestlers Protest Updates: బ్రిజ్‌భూషణ్‌పై మారిన రెజ్లర్ల వైఖరి  

26 Jun, 2023 07:09 IST|Sakshi

సోషల్‌ మీడియాకు కొన్ని రోజులు దూరం

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండుసార్లు నిరసన దీక్ష చేపట్టిన స్టార్‌ రెజ్లర్ల వైఖరి మారింది. తమకు న్యాయం దక్కేవరకు ఆయనపై పోరాటం కొనసాగుతుందని, అయితే అది కోర్టులోనే తేల్చుకుంటామని... ఇకపై రోడ్డెక్కబోమని రెజ్లర్లు ప్రకటించారు.

‘డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మేం వేచిచూస్తాం. కానీ బ్రిజ్‌భూషణ్‌పై మా పోరాటాన్ని మాత్రం విరమించే ప్రసక్తేలేదు’ అని వినేశ్‌ ఫొగాట్‌ ట్వీట్‌ చేసింది. అనంతరం కొన్నాళ్లపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటామని వినేశ్‌తో పాటు సాక్షి మలిక్‌ తెలిపింది.   

డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలపై స్టే 
భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఇప్పుడు గువాహటి హైకోర్టు స్టేతో మరో వాయిదా తప్పేలాలేదు. అస్సాం సంఘం తమ సభ్యత్వాన్ని గుర్తించకపోవడం, ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటీషన్‌ వేయగా వచ్చే నెల 11న జరగాల్సిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలపై కోర్టు స్టే విధించింది.   

మరిన్ని వార్తలు