IPL 2023: గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌ షాక్‌.. హ్యాండ్‌ ఇచ్చిన కిల్లర్‌ మిల్లర్‌

20 Mar, 2023 19:55 IST|Sakshi

David Miller: ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఛాంపియన్‌ ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు స్వయంగా వెల్లడించాడు.  వరల్డ్‌ కప్ సూపర్ లీగ్ (WCSL)లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగే అత్యంత కీలకమైన రెండు వన్డే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేందుకు మిల్లర్‌తో పాటు ఐపీఎల్‌లో పాల్గొనే పలువురు సఫారీ స్టార్‌ ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

సరిగ్గా ఐపీఎల్‌-2023 ప్రారంభ తేదీనే (మార్చి 31) సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌తో తొలి వన్డే, అనంతరం ఏప్రిల్‌ 2న రెండో వన్డే ఆడాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే దక్షిణాఫ్రికా ఈ రెండు వన్డేల్లో గెలిచి తీరాలి. అందుకే క్రికెట్‌ సౌతాఫ్రికా స్టార్‌ ఆటగాళ్లనంతా ఈ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండాలని కోరింది.

ఇది మ్యాండేటరీ కాకపోయినప్పటికీ.. జాతీయ జట్టు అవసరాల దృష్ట్యా సౌతాఫ్రికా క్రికెటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిల్లర్‌తో పాటు సఫారీ ఆటగాళ్లు ఎయిడెన్‌ మార్క్రమ్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), మార్కో జన్సెన్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), అన్రిచ్‌ నోర్జే, లుంగి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ (ముంబై ఇండియన్స్‌), క్వింటన్‌ డికాక్‌ (లక్నో), రబాడ (పంజాబ్‌)  ఐపీఎల్‌-2023లో వారాడే ఒకటి, రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం  ఉంది.  

కాగా, గతేడాది ఐపీఎల్‌కు ముందు కూడా సౌతాఫ్రికా క్రికెటర్లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే అప్పుడు రబాడ, ఎంగిడి, జన్సెన్‌, మార్క్రమ్‌, డస్సెన్‌లు జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్‌కు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి లీగ్‌లో ఆడారు. అప్పుడు సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడింది. ఐపీఎలా లేక జాతీయ జట్టా అన్న నిర్ణయాన్ని క్రికెట్‌ సౌతాఫ్రికా ఆటగాళ్లకే వదిలేయడంతో వారు అప్పట్లో ఐపీఎల్‌కే ఓటేశారు.  
 

మరిన్ని వార్తలు