HAMBURG: రన్నరప్‌ బోపన్న జంట

25 Jul, 2022 02:39 IST|Sakshi

న్యూఢిల్లీ: తన కెరీర్‌లో 22వ డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు నిరాశ ఎదురైంది. హాంబర్గ్‌ యూరోపియన్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జంట రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జర్మనీలో జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ బోపన్న–మిడిల్‌కూప్‌ ద్వయం 2–6, 4–6తో అన్‌సీడెడ్‌ లాయిడ్‌ గ్లాస్‌పూల్‌ (బ్రిటన్‌)–హెలియోవారా (ఫిన్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.

63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. విజేతగా నిలిచిన గ్లాస్‌పూల్‌–హెలియోవారా జోడీకి 1,08,770 యూరోల (రూ. 88 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీ, 500 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ బోపన్న జంటకు 58 వేల యూరోల (రూ. 47 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ, 300 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

మరిన్ని వార్తలు