సెమీస్‌లో బోపన్న జోడీ

18 Nov, 2023 05:47 IST|Sakshi

టురిన్‌ (ఇటలీ): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ... పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెడ్‌ గ్రూప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–4, 7–6 (7/5)తో ఈ ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ చాంపియన్స్‌ వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జంటపై గెలిచింది.

ఈ గెలుపుతో రెడ్‌ గ్రూప్‌ నుంచి బోపన్న–ఎబ్డెన్‌; రాజీవ్‌ రామ్‌ (అమెరికా)–జో సాలిస్‌బరీ (బ్రిటన్‌) జోడీలు సెమీఫైనల్‌కు అర్హత పొందాయి. ఈ సీజన్‌లో బోపన్న–ఎబ్డెన్‌ జోడీ 40 మ్యాచ్‌ల్లో గెలిచింది. సీజన్‌ ముగింపు టోరీ్నలో బోపన్న ఆడటం ఇది నాలుగోసారి (2023, 2015, 2012, 2011) కాగా, ఎబ్డెన్‌ తొలిసారి బరిలోకి దిగాడు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రెండో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), మెద్వెదెవ్‌ (రష్యా), యానిక్‌ సినెర్‌ (ఇటలీ) సెమీఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు