Asian Boxing Championships 2022: క్వార్టర్‌ ఫైనల్లో హుసాముద్దీన్‌

3 Nov, 2022 09:37 IST|Sakshi

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా ఎలైట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన 57 కేజీల విభాగం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హుసాముద్దీన్‌ 3–2తో మునార్‌బెక్‌ (కిర్గిస్తాన్‌)పై గెలుపొందాడు.

ఇటీవల బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన హుసాముద్దీన్‌ క్వార్టర్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ బాక్సర్‌ ఇలియాస్‌ హుస్సేన్‌తో తలపడతాడు. క్వార్టర్‌ ఫైనల్లో హుసాముద్దీన్‌ గెలిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. మరోవైపు 80 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన లక్ష్య చహర్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య చహర్‌ 5–0తో షబ్బోస్‌ నెగ్మత్‌ (తజికిస్తాన్‌)పై గెలుపొందాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్పర్శ్‌ కుమార్‌ (51 కేజీలు) 1–4తో ప్రపంచ చాంపియన్‌ సాకెన్‌ బిబోసినోవ్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. ఈ మెగా టోర్నీలో 27 దేశాల నుంచి 267 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.
చదవండి: Hylo Open Badminton: తొలి రౌండ్‌లోనే లక్ష్య సేన్‌ ఓటమి

మరిన్ని వార్తలు