Ind vs Aus: ససెక్స్‌ను వీడి భారత్‌కు! రోహిత్‌, బుమ్రాలతో రాజ్‌కోట్‌కు పుజారా

26 Sep, 2023 16:24 IST|Sakshi
బుమ్రా, రోహిత్‌ శర్మతో పుజారా (PC: Pujara)

Ind vs Aus 3rd ODI- Pujara With Jasprit Bumrah and Rohit Sharma: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ గెలిచి టీమిండియా ఫుల్‌ జోష్‌లో ఉంది. తొలి రెండు మ్యాచ్‌లలో జయకేతనం ఎగుర వేసిన భారత జట్టు 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తదితరులు లేకుండానే కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో బరిలోని దిగిన టీమిండియా.. ఆసీస్‌కు షాకులిచ్చింది. ముఖ్యంగా రెండో వన్డేలో ఫామ్‌లేమితో కొట్టుమిట్టాడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఏకంగా సెంచరీతో మెరవడం సానుకూలాంశంగా పరిణమించింది.

ఇదిలా ఉంటే.. రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో నామమాత్రపు మూడో వన్డేకు భారత్‌ సిద్ధమైంది. ఈ క్రమంలో రోహిత్‌, కోహ్లి, హార్దిక్‌ తదితరులు విశ్రాంతి విరమించి మైదానంలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

రోహిత్‌తో పాటు బుమ్రా... పుజారా కూడా అదే విమానంలో
ఈ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రెండో వన్డేకు దూరమైన జస్‌ప్రీత్‌ బుమ్రా బుధవారం నాటి మ్యాచ్‌ కోసం ముంబై నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్‌ పుజారా విమానంలో వారిని కలిశాడు.

రోహిత్‌, బుమ్రా మధ్యన కూర్చున్న పుజ్జీ ఆ ఫొటోను మంగళవారం.. తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా చాలాకాలంగా జట్టుకు దూరమైన పుజారా ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న విషయం తెలిసిందే.

సస్పెన్షన్‌ కారణంగా
ససెక్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న పుజారా.. 8 మ్యాచ్‌లలో అతడు 649 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, జట్టు క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా అతడిపై ఇటీవల సస్పెన్షన్‌ పడింది. దీనిపై ససెక్స్‌ అధికారులు అప్పీలుకు వెళ్లలేదు.

ఈ నేపథ్యంలో నిరాశ చెందిన పుజారా ఇంటికి తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది. స్వస్థలం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు విమానంలో వస్తుండగా ఇలా అనుకోకుండా సహచర ఆటగాళ్లను కలిశాడు.

చదవండి: WC: ఎవరిని తప్పిస్తారో తెలియదు.. అతడు మాత్రం ప్రతి మ్యాచ్‌ ఆడాల్సిందే!

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara)

మరిన్ని వార్తలు