నేడు భారత్, ఐర్లాండ్ రెండో టి20
రాత్రి గం.9 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3, 4లలో ప్రత్యక్ష ప్రసారం
డబ్లిన్: తొలి టి20లో ఐర్లాండ్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ నేడు జరిగే రెండో టి20లోనూ విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే గత మ్యాచ్లాగే ఈ సారి కూడా ఆటకు వాన అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ తొలి పోరులాగే మ్యాచ్ను కుదించాల్సి వచ్చినా... టీమిండియా ఆధిపత్యాన్ని ఐర్లాండ్ ఎంత వరకు నిలువరించగలదనేది చూడాలి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టి20ల్లోనూ ఐర్లాండ్ను చిత్తు చేయడం భారత్ పైచేయిని చూపిస్తోంది. వర్షం కురిస్తే పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండగా... వానతో అంతరాయం ఏర్పడకపోతే బ్యాటింగ్లో పరుగుల వరుద పారవచ్చు.
సామ్సన్ లేదా త్రిపాఠి...
12 ఓవర్ల మ్యాచ్లో భారత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాస విజయాన్ని అందుకుంది. కాబట్టి అదే జట్టును కొనసాగించాలని మేనేజ్మెంట్ భావించడం సహజం. అయితే రుతురాజ్ గాయంతో బాధపడుతుండటంతో ఒక స్థానం ఖాళీగా కనిపిస్తోంది. ఓపెనర్గా అనుభవం ఉన్న రాహుల్ త్రిపాఠి లేదా పునరాగమనం చేసిన సంజు సామ్సన్లలో ఒకరికి చోటు దక్కవచ్చని అంచనా. మిగతా ఆటగాళ్లంతా గత మ్యాచ్లో తమ వంతు పాత్రను పోషించారు. అరంగేట్ర మ్యాచ్లో వేసిన ఒకే ఒక ఓవర్లో తడబడిన ఉమ్రాన్ మలిక్కు కూడా మరో అవకాశం దక్కవచ్చు. భువనేశ్వర్, చహల్ల బౌలింగ్ ముందు ఐర్లాండ్ నిలబడలేకపోయింది. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. మొత్తంగా చూస్తే టాప్ ఆటగాళ్లు లేకపోయినా ప్రత్యర్థి ముందు భారత్ ఏ రకంగా చూసినా మెరుగైన జట్టే. జోరును కొనసాగిస్తే సిరీస్ గెలుపు ఖాయం.
టెక్టర్పై దృష్టి...
గత మ్యాచ్లో ఐర్లాండ్ సంతోషించే అంశం ఏదైనా ఉందీ అంటే అది హ్యారీ టెక్టర్ బ్యాటింగే. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిన అతని బ్యాటింగ్ భారత శిబిరాన్ని కూడా ఆకట్టుకుంది. టెక్టర్ను ప్రత్యేకంగా అభినందిస్తూ హార్దిక్ తన బ్యాట్ను అతనికి బహుమతిగా కూడా ఇచ్చాడు. పెద్ద జట్టుపై సత్తాను చాటేందుకు అతనికి ఇది మరో మంచి అవకాశం. తొలి పోరులో విఫలమైన సీనియర్లు పాల్ స్టిర్లింగ్, ఆండీ బల్బర్నీ, డాక్రెల్ బాధ్యతగా ఆడాల్సి ఉంది. సొంతగడ్డపై చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించేందుకు ఐర్లాండ్కు ఇదే మంచి అవకాశం. అయితే పేలవ బౌలింగ్తో జట్టు ఇబ్బంది పడుతోంది. టీమిండియాను నిలువరించడం వారికి కష్టం కావచ్చు.