Ravindra Jadeja: జడేజా గాయంపై అప్‌డేట్‌ ఇచ్చిన ధావన్‌.. వాళ్లు ఉన్నారు కదా!

22 Jul, 2022 14:50 IST|Sakshi
రవీంద్ర జడేజా(ఫైల్‌ ఫొటో)

Shikhar Dhawan Update On Ravindra Jadeja Fitness: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన రవీంద్ర జడేజా గాయం గురించి సారథి శిఖర్‌ ధావన్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. అతడు మొదటి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా గాయపడ్డ జడేజా.. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం నాటి సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌కు అతడు దూరమైనట్లు వార్తలు వినిపించాయి.


శిఖర్‌ ధావన్‌(PC: BCCI)

వాళ్లంతా ఉన్నారు కదా!
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శిఖర్‌ ధావన్‌.. ‘‘ప్రస్తుతం తను గాయం కారణంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే, తను మొదటి వన్డే ఆడతాడో లేడో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. ఒకవేళ తను దూరమైనా స్పిన్‌ విభాగంలో అక్షర్‌ పటేల్‌, యజువేంద్ర చహల్‌ ఉండనే ఉన్నారు.  మరోవైపు సిరాజ్‌, ప్రసిద్‌ కూడా జట్టుతో ఉన్నారు. మాకు అద్భుతమైన ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగం ఉంది. మా బౌలర్లు తప్పకుండా ప్రభావం చూపుతారు’’ అని పేర్కొన్నాడు.

సంతోషంగా ఉంది!
ఇక ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గబ్బర్‌..‘‘యువ ఆటగాళ్లతో నా అనుభవాలు పంచుకునే అవకాశం లభించింది. చాలా సంతోషంగా ఉన్నాను. అయితే, వర్షం కారణంగా తగినంత ప్రాక్టీసు చేయలేకపోయాం. 

ప్రస్తుత జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో సమతుల్యంగానే ఉంది. సూర్యకుమార్‌ యాదవ్‌ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినా.. మంచి పరిణతి కలిగిన ఆటగాడు. శ్రేయస్‌, శార్దూల్‌ కూడా చాలా కాలం నుంచి ఆడుతున్న వాళ్లే. ద్రవిడ్‌ భాయ్‌తో నా అనుబంధం ఈనాటిది కాదు.

శ్రీలంక పర్యటనలో కూడా మేము కలిసి పనిచేశాం’’ అని చెప్పుకొచ్చాడు. విండీస్‌ పర్యటనలో గెలుపే క్ష్యంగా ముందకు సాగుతున్నట్లు ధావన్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకున్న టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విండీస్‌ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితాలు పునరావృతం చేయాలని భావిస్తోంది. 

చదవండి: Scott Styris On Shreyas Iyer: టీమిండియా తదుపరి కెప్టెన్‌ అతడే! ఆ ఒక్క బలహీనత అధిగమిస్తే..

మరిన్ని వార్తలు