India New T20 Captain: టీమిండియాకు కాబోయే టీ20 కెప్టెన్‌ అతడే

20 Oct, 2021 16:00 IST|Sakshi

Rohit Sharma to succeed Virat Kohli: పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత.. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న హిట్‌మ్యాన్‌కు ప్రమోషన్‌ దక్కనుంది. ఈ మేరకు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ కథనం ప్రచురించింది. ‘‘ఇందులో రహస్యమేమీ లేదు. విరాట్‌ కోహ్లి తర్వాత రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్‌ అవుతాడు. ఇందుకు సంబంధించి వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది.

కాగా టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని విరాట్‌ కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ సారథిగా ఎంపికకావడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు.. రోహిత్‌ శర్మ వయస్సు(34) దృష్ట్యా అతడిని వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ కోహ్లి ఈ మేరకు సెలక్షన్‌ కమిటీకి సూచించాడన్న ఊహాగానాలు కూడా వినిపించాయి.

హిట్‌మ్యాన్‌ స్థానంలో... వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌, టీ20లలో రిషభ్‌ పంత్‌కు ఈ పదవి ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని మన్నించకపోవడంతోనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడనే పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో... రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడం తథ్యమని బీసీసీఐ వర్గాలు చెప్పడం హిట్‌మ్యాన్‌ అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. కాగా ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన సారథిగా రోహిత్‌ శర్మ(5)కు రికార్డు ఉన్న విషయం విదితమే. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో అక్టోబరు 24న టీమిండియా పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: T20 World Cup 2021: వెస్టిండీస్ జట్టుకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం

మరిన్ని వార్తలు