India vs South Africa 2nd T20: వరుణుడు కరుణిస్తేనే...

12 Dec, 2023 00:52 IST|Sakshi

నేడు భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్‌

పొంచి ఉన్న వానముప్పు

రాత్రి గం.8:30 నుంచి ‘స్టార్‌ స్పోర్ట్స్‌–1’లో ప్రత్యక్ష ప్రసారం  

పోర్ట్ట్‌ ఎలిజబెత్‌: వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న ఈ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో జట్టును సిద్ధం చేసుకోవాలని ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు చూస్తుంటే ప్రతికూల వాతావరణం పెను సమస్యగా మారింది. తొలి మ్యాచ్‌ వర్షంలో కోట్టుకుపోగా... ఇప్పుడు రెండో టి20కి కూడా వానముప్పు ఉండటం ఇరుజట్లకు ఇబ్బందిగా మారింది.

జట్లకే కాదు... మ్యాచ్‌ల్ని అస్వాదించాలనుకున్న అభిమానులకు, రూ.కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ)కు కూడా ఈ వాతావరణ పరిస్థితులు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలస్యంగా మొదలవనున్న రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్‌ జరిగినా మెరుపుల టి20ని చూడొచ్చని ఆశిస్తున్నారు.  

టాస్‌ పడితే...
డర్బన్‌లో కనీసం టాస్‌ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే జట్లు టాస్‌ పడి ఆటకు బాట పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆసీస్‌తో సొంతగడ్డపై యువభారత్‌ను నడిపించిన సూర్యకుమార్‌కు ఈ సిరీస్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పలువురు అనుభవజు్ఞలు శుబ్‌మన్‌ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌లు జతవడంతో టీమిండియా క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాపై అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్‌ శర్మ, రవి బిష్ణోయ్‌లు కూడా తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు.

కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్‌కె, బర్గర్‌లను పరీక్షించాలనుకుంటే కుదరడం లేదు. దీంతో బవుమా లేని జట్టులో మార్క్‌రమ్‌ తన మార్క్‌ చూపించేందుకు అవకాశం చిక్కడం లేదు. మ్యాచ్‌ రోజు వానపడినా... మ్యాచ్‌ సమయానికల్లా తెరిపినిస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇరుజట్లలోని యువ ఆటగాళ్లంతా కొండంత ఊరట పొంది ఆటపై దృష్టిపెడతారు. తమ సత్తా చాటుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు