భారత మహిళా క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌పై వేటు

13 Aug, 2021 07:43 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మను బీసీసీఐ తప్పించింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టు సభ్యులతో పాటు సహాయక సిబ్బంది కూడా బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘బయోబబుల్‌’లోకి మంగళవారంలోగా అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అభయ్‌ ఇంకా జట్టుతో చేరకపోవడంతో ఆయనను తొలగించినట్లు తెలిసింది.

ఈ క్రమంలో.. త్వరలోనే ఫీల్డింగ్‌ కోచ్‌ను ఎంపిక చేస్తామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, 52 ఏళ్ల అభయ్‌ శర్మ భారత దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, రైల్వేస్‌, రాజస్థాన్‌ జట్ల తరఫున వికెట్‌ కీపర్‌గా రాణించాడు. ఇటీవలి కాలంలో అతను ఇండియా-ఏ, భారత్‌ అండర్‌-19 జట్లకు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదే ఏడాది అభయ్‌ భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. 

మరిన్ని వార్తలు