థాయ్‌లాండ్‌తో భారత్‌ తొలి పోరు 

13 Sep, 2023 01:13 IST|Sakshi

మహిళల హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ  

రాంచీ: భారత్‌ వేదికగా తొలిసారి జరగనున్న మహిళల ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీ షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 5 వరకు జరిగే ఈ టోర్నీకి రాంచీ ఆతిథ్యమివ్వనుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలేసియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అక్టోబర్‌ 27న థాయ్‌లాండ్‌ జట్టుతో భారత్‌ తమ టైటిల్‌ వేటను ప్రారంభిస్తుంది.

అనంతరం 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్‌తో, నవంబర్‌ 2న కొరియాతో భారత్‌ ఆడుతుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక టాప్‌–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌ నవంబర్‌ 4న, ఫైనల్స్‌ నవంబర్‌ 5న జరుగుతాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆసియా మహిళల చాంపియన్స్‌ ట్రోఫీ ఆరుసార్లు జరిగింది. భారత్‌ 2016లో టైటిల్‌ గెలిచింది. 2010లో మూడో స్థానం పొందగా.. 2013, 2018లో రన్నరప్‌గా నిలిచింది.   

మరిన్ని వార్తలు