అక్రమ్‌, మెక్‌గ్రాత్ తర్వాత అండర్సన్‌ మాత్రమే

5 Mar, 2021 16:15 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ రెండోరోజు ఆటలో అజింక్య రహానేను ఔట్‌ చేయడం ద్వారా అండర్సన్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 900 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటి వరకూ ఆరుగురు బౌలర్లు మాత్రమే ఈ మార్క్‌ని చేరుకోగా.. ఇందులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారు.

గురువారం ఓపెనర్ శుభమన్ గిల్ (0)ని మొదటి ఓవర్‌లోనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న జేమ్స్ అండర్సన్.. ఈరోజు వైస్ కెప్టెన్ అజింక్య రహానేను ఔట్‌ చేసి ఈ ఫీట్‌ అందుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని వెంటాడిన రహానె.. స్లిప్‌లో బెన్‌స్టోక్స్ చేతికి చిక్కాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితా చూస్తే..  శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 1,347 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ (1,001 వికెట్లు), భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (956), ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (949), పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ (916) టాప్-5లో కొనసాగుతున్నారు. తాజాగా ఆరో బౌలర్/ మూడో పేసర్‌గా జేమ్స్ అండర్సన్ (900) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
చదవండి: 
ఒకే దెబ్బకు రోహిత్‌ శర్మ రెండు రికార్డులు
నాలుగో టెస్టు : పంత్‌ దూకుడు.. ఆధిక్యంలోకి టీమిండియా

మరిన్ని వార్తలు