#KLRahul On Trolls: 'చెత్తగా ఆడాలని ఎవరనుకోరు.. ట్రోల్స్‌ బాధించాయి'

17 May, 2023 20:08 IST|Sakshi

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్  సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది కాలంగా రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే దీనిని చాలా వరకూ పట్టించుకోకపోయినా.. ఏదో ఒక సమయంలో ట్రోలింగ్ తనపై ప్రభావం చూపుతుందని తానే స్వయంగా పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో మ్యాచ్‌ అనంతరం గాయపడిన కేఎల్‌ రాహుల్‌ టోర్నీకి దూరమయ్యాడు. లండన్‌లో రాహుల్‌కు సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం కేఎల్‌ రాహుల్‌ ''ది రణ్‌వీర్ షో''లో మాట్లాడాడు. ఈ ట్రోలింగ్ తనతోపాటు కొంతమంది ఇతర ప్లేయర్స్ ను కూడా అప్పుడప్పుడూ ప్రభావితం చేస్తుందని రాహుల్ వెల్లడించాడు.

"సోషల్ మీడియా ట్రోలింగ్ నాతోపాటు మరికొందరు ప్లేయర్స్ ను అప్పుడప్పుడూ ఆవేదనకు గురి చేస్తుంది. మాకు మద్దతు అవసరమైన సమయంలో అభిమానులు తాము ఏది కావాలంటే అనే హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరూ ఆలోచించరు. మేమెవరమూ చెత్తగా ఆడాలని కోరుకోము. ఇదే మా జీవితం. మేము చేసేది ఇదే. నాకు క్రికెట్ తప్ప మరేమీ తెలియదు.

నేను చేసేది క్రికెట్ ఆడటమే. నేను నా గేమ్ పై సీరియస్ గా లేనని లేదా కఠినంగా శ్రమించడం లేదని ఎవరైనా ఎలా అంటారు? కానీ స్పోర్ట్స్ లో అలా కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉండదు. నేను ఎంత కష్టపడినా.. ఫలితం నాకు అనుకూలంగా రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి" అని రాహుల్ పేర్కొన్నాడు.

ఇక చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ లో రాహుల్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఆ మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రెండు టెస్టులు ఆడిన రాహుల్.. వాటిలో విఫలమయ్యాడు. కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది ఐపీఎల్లో బాగానే ఆడినా.. అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చాయి. గాయంతో ఐపీఎల్‌కు దూరమైన రాహుల్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడడం లేదు.

చదవండి: 'అంతా అబద్దం.. నేను ధోని తొలి వికెట్‌ను కాదు'

మరిన్ని వార్తలు