Vijay Hazare Trophy 2021: రెండో సెంచరీతో చెలరేగిన కేఎస్‌ భరత్‌

14 Dec, 2021 19:51 IST|Sakshi

KS Bharat Blazing Hundred Against Gujarat: విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో ఐపీఎల్‌ స్టార్లు(దేశీయ ఆటగాళ్లు) రెచ్చిపోతున్నారు. వరుస సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఐపీఎల్‌ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(సీఎస్‌కే) 5 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలతో విధ్వంసం సృష్టించగా.. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు, ఆంధ్రా బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ టోర్నీలో వరుసగా రెండో భారీ శతకం(138 బంతుల్లో 156; 16 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించి.. ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలకు సవాల్‌ విసిరాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్.. కెప్టెన్‌ భరత్‌ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన గుజరాత్‌ ఆంధ్ర బౌలర్ల ధాటికి 172 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఆంధ్ర జట్టు 81 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 

ఇదిలా ఉంటే, విజయ్ హజారే ట్రోఫీ 2021లో కేఎస్ భరత్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. అంతకుముందు, హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ 109 బంతుల్లో 16  బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో 161 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన భరత్ 2 సెంచరీల సాయంతో 370 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో రుతురాజ్(5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 603 పరుగులు), భరత్‌తో పాటు మరో ఐపీఎల్‌ స్టార్‌ వెంకటేశ్‌ అయ్యర్‌(5 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 349 పరుగులు) కూడా రాణిస్తున్నాడు. 
చదవండి: బ్రేక్‌ తీసుకోవచ్చు.. కానీ​.. ! రోహిత్‌, కోహ్లిలపై విరుచుకుపడ్డ భారత మాజీ కెప్టెన్

మరిన్ని వార్తలు