LLC 2023: వైజాగ్‌లో లెజెండ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ మ్యాచ్‌లు

30 Nov, 2023 18:37 IST|Sakshi
PC: LLC X

వైజాగ్‌లో లెజెండ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ మ్యాచ్‌లు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 70 మంది క్రికెటర్లు రాక

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ టీ–20 తొలి దశ మ్యాచ్‌లకు విశాఖ కూడా ఆతిథ్యం ఇవ్వ‌నుంది. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఇందుకు వేదిక కానుంది.

ఈ విష‌యాన్ని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 2 నుంచి 4 వరకు గ‌ల షెడ్యూల్‌లో భాగంగా ఇక్క‌డ‌ ఐదు జట్లు ప్ర‌త్యర్థుల‌తో తలపడనున్నాయి. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన దాదాపు 70 మంది క్రికెటర్లు వైజాగ్‌కు రానున్నారు. 

ఇక మాజీ ఓపెన‌ర్‌ గౌతమ్‌ గంభీర్‌ సారథిగా వ్యవహరించే ఇండియా క్యాపిటల్స్‌ కెవిన్‌ పీటర్స్‌న్, యశ్‌పాల్‌సింగ్, రిచర్డ్‌ పావెల్, మునాఫ్‌ పాటేల్, దిల్హార్‌ ఫెర్నాండో తదితరులు ఉన్నారు.

►మ‌రోవైపు.. హర్బజన్‌సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించే మణిపాల్‌ టైగర్స్‌ జట్టులో ఎస్‌. బద్రినాథ్, రాబిన్‌ ఊతప్ప, మహ్మద్‌ కైఫ్, ప్రవీణ్‌కుమార్, పంకజ్‌ సింగ్, మిశ్చెల్, కారీ అండర్సెన్ ఉన్నారు

►అదే విధంగా..  సురేష్‌ రైనా సారథిగా వ్యవహరించే అర్బన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో మార్టిన్ గప్టిల్‌, డ్వేన్‌ స్మిత్, ప్రజ్జాన్‌ ఓజా, టినో బెస్ట్, చమర కాపుగెందర భాగం కానున్నారు.

►ఇక‌ పార్థీవ్‌ పటేల్‌ కెప్టెన్‌గా వ్యవహరించే గుజరాత్‌ జైంట్స్‌ జట్టులో క్రిస్‌ గేల్, కెవిన్‌ ఓ బ్రియన్, హమీద్‌ రజా, ఎస్‌. శ్రీశాంత్ ఉండ‌నున్నారు.

►అదేవిధంగా ఆరోన్‌ ఫించ్‌ సారథిగా ఉన్న సదరన్‌ సూపర్‌స్టార్స్‌ జట్టులో అబ్దుల్‌ రజాక్, టేలర్, ఉపుల్‌ తరంగ, అశోక్‌ దిండా తదితరులు ఉన్నారు. 

షెడ్యూల్‌ ఇలా..
►డిసెంబర్ 2- సాయంత్రం 7 గంటలకు ఇండియా క్యాపిటల్స్- మణిపాల్‌ టైగర్స్
►3-మధ్యాహ్నం 3 గంటలకు గుజరాత్‌ జైంట్స్- సదరన్‌ సూపర్‌ స్టార్స్
►4- సాయంత్రం 7 గంటలకు మణిపాల్‌ టైగర్స్‌- అర్బ‌న్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి.
కాగా రాంచి వేదిక‌గా న‌వంబ‌రు 18న మొద‌లైన లెజెండ్స్ లీగ్ డిసెంబ‌రు 9న సూర‌త్‌లో జ‌రిగే ఫైన‌ల్‌తో ముగియ‌నుంది.

మరిన్ని వార్తలు