World Cup 2023: ఓటమి బాధలో ఉన్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌!

6 Nov, 2023 17:51 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో సెమీఫైనల్స్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ లుంగీ ఎంగిడి గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఎంగిడీ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో జడేజా కొట్టిన బంతిని అపే క్రమంలో ఎంగిడి కాలికి గాయమైంది.

దీంతో నొప్పితో విల్లావిల్లాడిన ఎంగిడీ ఓవర్‌ పూర్తి చేయకుండానే ఫీల్డ్‌ను వదిలి వెళ్లాడు. మిగిలిన ఓవర్‌ను జానెసన్‌ పూర్తి చేశాడు. తర్వాత ఎంగిడి బ్యాటింగ్‌కు వచ్చినప్పటకీ జడేజా బౌలింగ్‌లో డకౌటయ్యాడు. అయితే అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని ప్రోటీస్‌ వైద్యబృందం సూచించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఎంగిడీ మిగిలిన టోర్నీకి దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అతడికి బ్యాకప్‌గా రిలీ రూసోను దక్షిణాఫ్రికా జట్టు మేనెజ్‌మెంట్‌ భారత్‌కు రప్పించింది. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో విలియమ్స్‌ రూపంలో మరో అదనపు పేసర్‌ ఉన్నాడు. ఒక వేళ ఎంగిడి దూరమైతే కోట్జే లేదా విలియమ్స్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. కాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.
చదవండి: WC 2023: బంగ్లాదేశ్‌ అప్పీలు.. మాథ్యూస్‌ అవుట్‌! అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి!

మరిన్ని వార్తలు