రైనాకు సీఎస్‌కే దారులు మూసుకుపోయినట్లేనా..!

31 Aug, 2020 15:15 IST|Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా ఐపీఎల్‌ టోర్నీనుంచి అనుహ్యంగా తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైనా నిష్క్రమణపై ఇప్పటికే అనేక అనుమానాలు, పుకార్లు వస్తున్నాయి. కరోనా భయం కారణంగా భారత్‌కు తిరిగి వచ్చాడని కొంతమంది భావిస్తుండగా... కుటుంబ సమస్యలతో తిరుగుముఖం పట్టాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  దుబాయ్‌లో రైనాకు కేటాయించిన గది విషయంపై రైనా కొంత అసహం వ్యక్తం చేశాడని, ఈ క్రమంలోనే జట్టు యజమానికి అతనికి మధ్య స్పల్ప వివాదం  ఏర్పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే జట్టు యజమాని ఎన్‌ శ్రీనివాససన్‌ తాజాగా రైనాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. గది విషయంలో రైనా వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టిన శ్రీనివాసన్‌.. జట్టులో రైనా లేనంతమాత్రనా తమకేమీ న‍ష్టం లేదన్న రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రైనా స్థానంలో రాణించేందుకు ఎంతోమంది యువ ఆటగాళ్ల సిద్ధంగా ఉన్నారని కూడా పేర్కొన్నారు. శ్రీనివాసన్‌ తాజా కామెంట్స్‌ నేపథ్యంలో ఇరువురి మధ్య  పెద్ద వాదనే జరిగినట్లు తెలుస్తోంది. (రైనా నిష్ర్కమణపై శ్రీనివాసన్‌ ఆగ్రహం)

గొడవ కారణంగానే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి రైనా తప్పుకుని భారత్‌కు పయనమైనట్లు సమచారం. ఈ నేపథ్యంలో సీఎస్‌కేతో రైనా భవిష్యత్‌ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జట్టు యజమానిపైనే అతను దురుసుగా ప్రవర్తించాడని, ఇక రైనాతో  ఒప్పందాన్ని సీఎస్‌కే పూర్తిగా రద్దు చేసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చెన్నైకు ప్రాతినిథ్యం వహిస్తున్న రైనా.. మధ్యలో రెండేళ్లు నిషేధం మినహా అతను 2019 వరకు అదే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. చెన్నై తరుఫున 164 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ 4527  పురుగులతో ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్‌ లిస్ట్‌లో తొలిస్థానంలో (లీగ్‌ మొత్తంలో రెండో స్థానం) ఉన్నాడు. టీంలో ధోనీ తరువాత అత్యంత విలువైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే తాజా వివాదం నేపథ్యంలో భవిష్యత్‌లో జట్టులో కొనసాగుతాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా చెన్నై జట్టు అతనికి ప్రస్తుత లీగ్‌లో రూ.11 కోట్లు చెల్లిస్తోంది. రైనా తాజా నిర్ణయంతో ఆ మొత్తాన్ని కోల్పోనున్నాడు. 


 

>
మరిన్ని వార్తలు