National Games 2022: తెలంగాణ నెట్‌బాల్‌ జట్టుకు రజతం

1 Oct, 2022 04:15 IST|Sakshi

అహ్మదాబాద్‌: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్‌బాల్‌ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్‌బాల్‌ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది.

రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్‌ అమ్జాద్‌ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్‌ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల   సంయుత్, బి.రంజీత్‌ కుమార్, సయ్యద్‌ మొహమ్మద్‌ అహ్మద్, ఎన్‌.లునావత్‌ అఖిల్‌ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్‌ టెన్నిస్‌లో తెలంగాణ జట్టు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్‌ చేతిలో ఓడిపోయింది.  

మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 84+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు