నాన్‌స్ట్రైకర్ పరుగే పరుగు.. ఫన్నీ రనౌట్‌

10 Oct, 2020 16:55 IST|Sakshi

అబుదాబి: కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న  కేకేఆర్‌ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కింగ్స్‌ పంజాబ్‌ పేసర్‌ షమీ వేసిన మూడో ఓవర్‌ నాల్గో బంతికి కేకేఆర్‌ ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(4) బౌల్డ్‌ కాగా, ఆపై కాసేపటికి నితీష్‌ రాణా(2) రనౌట్‌ అయ్యాడు. ఈ రనౌట్‌ అయ్యే క్రమంలో నాటకీయ  పరిణామాలు చోటుచేసుకున్నాయి.  అర్షదీప్‌ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతిని శుబ్‌మన్‌ గిల్‌ షార్ట్‌ ఫైన్‌లెగ్‌లోకి ఆడాడు. అయితే ఆ సమయంలో ఫీల్డర్‌ ఉన్నాడు.

కానీ దాన్ని గ్రహించని నాన్‌స్ట్రైకర్‌ నితీష్‌ రాణా స్టైకింగ్‌ ఎండ్‌ వైపు పరుగు తీశాడు. ఆ పరుగుకి గిల్‌ ఒకే చెప్పకపోయినా రాణా మాత్రం అసలు ఆలోచనే లేకుండా అవతలి ఎండ్‌లోకి పరుగే పరుగు అన్నట్లు వెళ్లిపోయాడు. ఇక్కడ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ తమకు తాము రనౌట్‌ కాకుండా కాపాడుకుందామనే ఆలోచనే తప్పా, ఎవరో వికెట్‌ను కోల్పోవాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోయారు. నితీష్‌ రాణా తిరిగి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోకి తిరిగి చూసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహ్మద్‌ షమీ డైరెక్ట్‌ హిట్‌ చేద్దామని చూడగా, అది మిస్సయ్యింది. ఆ సమయంలో పూరన్‌ బంతిని స్మార్ట్‌గా అందుకుని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌ వికెట్లను గిరటేశాడు. దాంతో నితీష్‌ రాణా భారంగా పెవిలియన్‌కు వెళ్లాడు.

మరిన్ని వార్తలు