పంత్‌ వెనకాలే.. అయ్యర్‌!

20 Sep, 2020 20:59 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13 సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ దూకుడుగా ఆడే ప్రయత్నంలో కీలక వికెట్లను కోల్పోయింది. మ్యాచ్‌ ఆరంభంలో ధావన్‌(0), పృథ్వీ షా(5) స్వల్ప వ్యవధిలో ఔటైతే,  హెట్‌మెయిర్‌(7) కూడా నిరాశపరిచాడు. షా, హెట్‌మెయిర్‌లను షమీ ఔట్‌ చేసి కింగ్స్‌ మంచి ఆరంభాన్ని ఇవ్వగా, మరో అద్భుతమైన బ్రేక్‌ ఇచ్చాడు. ప్రమాదకరంగా మారుతున్న ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(39; 32 బంతుల్లో 3 సిక్స్‌లు)ను షమీ నకుల్‌ బాల్‌తో ఔట్‌ చేశాడు. భారీ షాట్‌కు యత్నించిన శ్రేయస్‌ అయ్యర్‌.. క్రిస్‌ జోర్డాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అయితే అంతకుముందు రిషభ్‌ పంత్‌(31;29 బంతుల్లో 4 ఫోర్లు) భారీ షాట్‌ ఆడే క్రమంలో బౌల్డ్‌ అయ్యాడు. రవిబిష్నోయ్‌ స్పిన్‌ చేస్తూ కాళ్ల మధ్య వేసిన బంతిని ఆడబోయి పంత్‌ వికెట్‌ను సమర్పించుకున్నాడు. పంత్‌ 14 ఓవర్‌ చివరి బంతికి ఔట్‌ అయితే, ఆపై 15 ఓవర్‌ తొలి బంతికి అయ్యర్‌ ఔటయ్యాడు. పంత్‌ వెనకాలే అయ్యర్‌ ఔట్‌ కావడంతో ఢిల్లీ మరోసారి కష్టాల్లో పడింది. 87 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోవడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసే అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి.(చదవండి: షమీ విజృంభణ: ఢిల్లీ విలవిల)

కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి వికెట్‌గా శిఖర్‌ ధావన్‌ పెవిలియన్‌ చేరగా, ఆపై మరో నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లను ఢిల్లీ చేజార్చుకుంది. ధావన్‌ అనవసరపు రన్‌ కోసం యత్నించి రనౌట్‌ కాగా, పృథ్వీ షా(5), హెట్‌మెయిర్‌(7)లను మహ్మద్‌ షమీ పెవిలియన్‌కు పంపాడు. కాస్త బౌన్స్‌ను మిక్స్‌ చేసి షమీ వేసిన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు పృథ్వీ షా, హెట్‌మెయిర్‌లు ఔటయ్యారు.  షమీ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతికి పృథ్వీ షా రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, ఆ ఓవర్‌ చివరి బంతికి హెట్‌మెయిర్‌ పెవిలియన్‌ చేరాడు.  షమీ ఒకే ఓవర్‌లో ఇద్దరి బ్యాట్స్‌మన్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. 
 

మరిన్ని వార్తలు