IPL 2023: సీఎస్‌కే గెలవగానే.. జడేజా భార్య రివాబా ఏం చేసిందంటే? వీడియో వైరల్‌

30 May, 2023 19:33 IST|Sakshi

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజా అందిం‍చిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌ పోరులో.. 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించి సీఎస్‌కే ఛాంపియన్స్‌గా నిలిచింది.

ఆఖరి రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. జడేజా ఓ సిక్స్, ఫోర్ బాది సీఎస్‌కేను ఐదోసారి ఛాంపియన్స్‌గా నిలిపాడు. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను చూసేందుకు ఇరు జట్ల ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చారు. ఇందులో జడేజా భార్య, జామ్ నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉంది. 

భావోద్వేగానికి లోనైన రివాబా..
ఇక జడేజా చివరి బం‍తికి ఫోరు బాది జట్టును గెలిపించగానే అభిమానులతో పాటు ఆటగాళ్ల కుటంబ సభ్యులు కూడా ఆనందంలో మునిగి తేలిపోయారు. ఈ క్రమంలో స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న రివాబా భావోద్వేగానికి లోనయ్యంది. పట్టరాని సంతోషంలో రివాబా కన్నీరు పెట్టుకుంది.

                                      

అనంతరం మైదానంలోకి వచ్చిన ఆమె జడేజా పాదాలకు దండం పెట్టింది. ఆ తర్వాత జడేజాను కౌగిలించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా మ్యాచ్‌ ప్రజేంటేషన్‌ అనంతరం ఐపీఎల్‌ ట్రోఫీతో జడేజా ఫ్యామిలీ కెమెరాలకు పోజులిచ్చారు. ఆ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో కూడా వీరు ఫోటోలు దిగారు.
చదవండి: ఇటువంటి అద్భుతాలు సర్‌ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా

మరిన్ని వార్తలు