కస్టమర్‌కు షాకింగ్‌ అనుభవం.. నూడుల్స్ ఆర్డర్ చేస్తే బతికున్న కప్ప!

30 May, 2023 19:42 IST|Sakshi

జపాన్ దేశంలో ఒక పేరు మోసిన రెస్టారెంట్‌లో ఒకాయన నూడుల్స్ ఆర్డర్ చేస్తే పాపం అతడికి నూడుల్స్‌లో కప్ప ప్రతక్షమైంది. పైగా ఆ కప్ప బతికుండటంతో ఆ పెద్దమనిషి తిన్నది కక్కలేక, మిగిలింది మింగలేక దయనీయ స్థితిలో ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. జపాన్‌కు చెందిన కైటో అనే ఓ వ్యాపారస్తుడు శుస్తిగా భోజనం చేద్దామని ఒక పెద్ద రెస్టారెంట్లోకి వెళ్లి నోరూరే స్పెషల్ థిక్ నూడుల్స్‌ను ఆర్డర్ చేశాడు. ఆ రెస్టారెంట్ వాళ్ళు ఈ ఐటెంను ఒక కప్పులో వడ్డిస్తారట. కొద్దిసేపు తర్వాత రెస్టారెంట్ బేరర్ ఓ ప్లేటులో నూడుల్స్ కప్పును తీసుకొచ్చి కైటో ముందుంచాడు.

అంతేకాదు ఆ బేరర్ కైటోకు తినే ముందు ఆ కప్పును బాగా షేక్ చేసి తింటే ఆ టేస్ట్ మరింత  బాగుంటుందని మరీ మరీ చెప్పడంతో కైటో ముందుగా నూడుల్స్ కప్పును బాగా షేక్ చేశాడు. ఆ తర్వాత కప్పును ఓపెన్ చేసి మెల్లగా తినటం ప్రారంభించాడు. నూడుల్స్ మహారుచిగా ఉండడంతో ఆవురావురుమంటూ లాగించేశాడు. తినటం క్లైమామ్స్‌కు వచ్చాక కప్పులో నుంచి ఒక్క కప్ప తల పైకి పెట్టి మరీ కైటోను కోపంగా చూస్తోంది. దాంతో కైటోకు కడుపంతా దేవేసినట్టైంది.

అప్పటికే దాదాపుగా నూడుల్స్ తినేయటంతో చేసేదేమీ లేక రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశాడు. పరువు పోతుందన్న భయంతో సదరు రెస్టారెంట్ యాజమాన్యం కైటోకు క్షమాపణ చెప్పి నష్టపరిహారాన్ని చెల్లించింది. ఆ రెస్టారెంట్ వారు క్షమాపణలు చెప్పినా కూడా కైటో తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ ఎదురు కాకూడదనే ఉద్దేశ్యంతో తన పరిస్థితి మొత్తాన్నీ వీడియోతో సహా జపానీస్ భాషలో తన ట్విట్టర్ అకౌంట్లో పొందుపరిచాడు.
చదవండి: మణిపూర్‌లో అమిత్‌ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం 

మరిన్ని వార్తలు