రికీ భుయ్‌ అజేయ శతకం

8 Jan, 2024 04:29 IST|Sakshi

ఆంధ్ర 339/6  

విశాఖ స్పోర్ట్స్‌: బెంగాల్‌ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ డివిజన్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యానికి 71 పరుగుల దూరంలో నిలిచింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది.

రికీ భుయ్‌ (243 బంతుల్లో 107 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయి మరో 220 పరుగులు సాధించింది. కెప్టెన్‌ హనుమ విహారి (51; 7 ఫోర్లు)తో కలిసి రికీ భుయ్‌ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేశాడు.

అనంతరం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (30; 6 ఫోర్లు)తో ఆరో వికెట్‌కు రికీ భుయ్‌ 71 పరుగులు జోడించాడు. ప్రస్తుతం షోయబ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ (31 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి రికీ భుయ్‌ ఏడో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జత చేశాడు. బెంగాల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.   
 

>
మరిన్ని వార్తలు