SMAT 2023: రింకూ సింగ్‌ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!

2 Nov, 2023 13:54 IST|Sakshi
కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన రింకూ సింగ్‌ (PC: IPL/BCCI)

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ చిచ్చరపిడుగు రింకూ సింగ్‌ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్‌తో ఇవాళ (నవంబర్‌ 2) జరుగుతున్న క్వార్టర్‌ఫైనల్‌-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు. రింకూ విధ్వంసం ధాటికి పంజాబ్‌ ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుంది.

ఆఖరి ఓవర్లో రింకూ టీమిండియా సహచరుడు అర్షదీప్‌ సింగ్‌ను టార్గెట్‌ చేశాడు. ఈ ఓవర్లో రింకూ 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. రింకూ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రింకూతో పాటు సమీర్‌ రిజ్వి (29 బంతుల్లో 42 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించాడు.

యూపీ ఇన్నింగ్స్‌లో గోస్వామి (16), కరణ్‌ శర్మ (14), నితీశ్‌ రాణా (17) తక్కువ స్కోర్లకే ఔటైనా సమీర్‌ అండతో రింకూ చెలరేగిపోయాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో సిద్దార్థ్‌ కౌల్‌, హర్ప్రీత్‌ బ్రార్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. నితీశ్‌ రాణా రనౌటయ్యాడు. 

అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (42 నాటౌట్‌), నేహల్‌ వధేరా (21 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ (12), ప్రభసిమ్రన్‌ సింగ్‌ (0), మన్‌దీప్‌ సింగ్‌ (1) నిరాశపరచగా.. అన్మోల్‌ప్రీత్‌, నేహల్‌ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ పొదుపుగా (2 ఓవర్లలో 3 పరుగులు) బౌలింగ్‌ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. మోహిసిన్‌ ఖాన్‌కు మరో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు