బీడబ్ల్యూఎఫ్‌ వార్షిక అవార్డు రేసులో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 

22 Nov, 2023 03:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ జోడీ  సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వార్షిక అవార్డు రేసులో నిలిచారు. 2023 సంవత్సరానికిగాను సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టిని ‘పెయిర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం కోసం బీడబ్ల్యూఎఫ్‌ నామినేట్‌ చేసింది. భారత ద్వయంతోపాటు చెన్‌ కింగ్‌ చెన్‌–జియా ఇ ఫాన్‌ (చైనా), జెంగ్‌ సి వె–హువాంగ్‌ యా కియాంగ్‌ (చైనా), సియో సెంగ్‌ జే–చె యు జంగ్‌ (దక్షిణ కొరియా) జోడీలు కూడా ఈ అవార్డు కోసం బరిలో ఉన్నాయి.

డిసెంబర్‌ 11న అవార్డు విజేతను ప్రకటిస్తారు. ఈ ఏడాది సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం అంచనాలకు మించి రాణించి అద్భుత విజయాలు సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఇండోనేసియా సూపర్‌–1000 టోర్నీలో, కొరియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీలో, స్విస్‌ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీలో డబుల్స్‌ టైటిల్స్‌ గెలిచింది.
 

మరిన్ని వార్తలు