‘వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ ఫైనల్లో నీరజ్‌ చోప్రా 

15 Nov, 2023 03:17 IST|Sakshi

మోంటెకార్లో: ఈ ఏడాది ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్‌ పురస్కారం తుది జాబితాలో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు స్థానం లభించింది. నెల రోజుల క్రితం ప్రపంచ అథ్లెటిక్స్‌ ఈ అవార్డు కోసం 11 మందిని నామినేట్‌ చేసింది. అక్టోబర్‌ 28తో ఓటింగ్‌ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఓటింగ్‌లో 20 లక్షల మంది పాల్గొన్నారు. ఓటింగ్‌ అనంతరం ఈ జాబితాను 11 నుంచి కుదించి టాప్‌–5 ఆటగాళ్లను ఎంపిక చేశారు.

ఈ ఐదుగురిలో ఒకరికి డిసెంబర్‌ 11న ‘వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభిస్తుంది. ఈ ఏడాది నీరజ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో తొలిసారి స్వర్ణ పతకం సాధించడంతోపాటు ఆసియా క్రీడల్లో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. నీరజ్‌తోపాటు రియాన్‌ క్రుసెర్‌ (అమెరికా; షాట్‌పుట్‌), డుప్లాంటిస్‌ (స్వీడన్‌; పోల్‌వాల్ట్‌), కిప్టుమ్‌ (కెన్యా; మారథాన్‌), నోవా లైల్స్‌ (అమెరికా; 100, 200 మీటర్లు) ‘వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం రేసులో ఉన్నారు.   
 

మరిన్ని వార్తలు