World cup 2023: రోహిత్‌ 20 సిక్స్‌లు కొట్టేవాడు.. ఆ బౌలర్‌ బతికిపోయాడు: షోయబ్‌ అక్తర్‌

6 Nov, 2023 17:15 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా చేతిలో 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 327 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రోటీస్‌ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగాడు. సఫారీలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో కూడా దారుణంగా విఫలమయ్యారు. మొదటి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. కాగా ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ మాత్రం స్పిన్నర్లకు అద్బుతంగా అనుకూలించింది.

అయితే స్పిన్‌కు అనుకూలించిన వికెట్‌పై విఫలమైన ప్రోటీస్‌ స్పిన్నర్‌ తబ్రైజ్‌ షమ్సీపై పాక్‌ మాజీ స్పీడ్‌ స్టార్‌ షోయబ్‌ అక్తర్‌ విమర్శల వర్షం కురిపించాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ షమ్సీ బౌలింగ్‌ను ఆడి వుంటే కనీసం 20 సిక్స్‌లు కొట్టేవాడని అక్తర్‌ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో షమ్సీ తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 72 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

అంతేకాకుండా ఏకంగా 7 వైడ్‌లు వేశాడు. ఒక స్పిన్నర్‌ ఇన్నివైడ్‌లు వేయడం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక అతడి తోటి స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ మాత్రం అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. మహారాజ్‌ తన కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

"రోహిత్‌ శర్మ అద్బుతమైన షాట్‌లు ఆడాడు. తబ్రైజ్ షమ్సీ చెత్త బౌలింగ్‌ వేశాడు. షమ్సీ రోహిత్‌కు అలాంటి బంతులను వేసి ఉంటే.. అతడు కనీసం 15 నుంచి 20 సిక్సర్లు కొట్టేవాడు. అప్పుడు భారత్‌ స్కోర్‌ బోర్డులో 430 పైగా పరుగులు వచ్చేవి.

ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్‌ శర్మ నిస్వార్థ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తున్నాడని" తన యూట్యూబ్‌ ఛానల్‌లో అక్తర్‌ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు.
చదవండిWC 2023: బంగ్లాదేశ్‌ అప్పీలు.. మాథ్యూస్‌ అవుట్‌! అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి!

మరిన్ని వార్తలు