Suranga Lakmal Retirement: శ్రీలంక క్రికెట్‌కు మరో షాకింగ్‌ న్యూస్‌

13 Mar, 2022 21:01 IST|Sakshi

Suranga Lakmal Retirement: వరుస అపజయాలతో సతమతమవుతున్న శ్రీలంక క్రికెట్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ సురంగ లక్మల్‌ (35).. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. భారత్‌తో సిరీస్‌ తనకు ఆఖరిదని ముందే ప్రకటించిన లక్మల్‌.. తన అంతర్జాతీయ కెరీర్లో చివరి బంతిని వేసేశాడు. పింక్‌ బాల్‌ టెస్ట్‌ రెండో రోజు ఆటలో లక్మల్‌ చివరి బంతిని టీమిండియా బ్యాటర్‌ రవీంద్ర జడేజా ఎదుర్కొన్నాడు. లక్మల్‌ తన ఆఖరి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. 

కాగా, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం జట్టు నుంచి తప్పుకుంటున్నాని, రిటైర్‌ అవడానికి ఇదే సరైన సమయమని లక్మల్‌ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక తరఫున 70 టెస్ట్‌ల్లో 171 వికెట్లు పడగొట్టిన లక్మల్‌.. 86 వన్డేల్లో 109 వికెట్లు, 11 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో అతను నాలుగు సార్లు  5 వికెట్లు ఘనతను సాధించాడు. 2018 కాలంలో టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన లక్మల్‌.. సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-0తో ఓడించి చరిత్ర సృష్టించాడు.  

ఇదిలా ఉంటే, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ (67), పంత్‌ (50) హాఫ్‌ సెంచరీలతో చెలరేగగా, లంక బౌలర్లలో జయవిక్రమ 4, ఎంబుల్దెనియా 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేయగా, శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. 
చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ ఖాతాలో మరో రికార్డు

మరిన్ని వార్తలు