అరవింద డిసిల్వాకు కూడా చోటు
దుబాయ్: భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇప్పటి వరకు తొమ్మిది మందికి చోటు లభించగా... ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలు అన్నీ పరిగణించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపిక చేస్తారు.
డయానా ఎడుల్జీ: భారత్లో అమ్మాయిల క్రికెట్వైపు కన్నెత్తి చూడని రోజుల్లోనే క్రికెటరై తర్వాత సారథిగా ఎదిగింది. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్రౌండర్గా రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లు తీసి, 404 పరుగులు చేసింది. 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లు పడగొట్టింది.
సెహ్వాగ్: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా సెహ్వాగ్ రికార్డుల్లోకెక్కాడు. భారత్ 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు చేశాడు. 40 వికెట్లు తీశాడు. 251 వన్డేలాడి 8273 పరుగులు, 15
సెంచరీలు సాధించాడు. 96 వికెట్లు కూడా తీశాడు. 19 టి20లు ఆడి 393 పరుగులు సాధించాడు.
అరవింద డిసిల్వా: ఆ్రస్టేలియాతో జరిగిన 1996 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో డిసిల్వా వీరోచిత సెంచరీతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 308 వన్డేల్లో 9284 పరుగులు చేశాడు. 106 వికెట్లు పడగొట్టాడు. 93 టెస్టుల్లో 6361 పరుగులు సాధించాడు.