T20 WC 2021: ఎలిమినేటెడ్‌ బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌.. కెప్టెన్‌ మాత్రం లేడు

9 Nov, 2021 15:51 IST|Sakshi

Best Playing XI From Teams Eliminated In Super 12.. టి20 ప్రపంచకప్‌ 2021 నవంబర్‌ 14తో ముగియనున్న సంగతి తెలిసిందే. టీమిండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్గానిస్తాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌లు సూపర్‌ 12 దశలో వెనుదరిగాయి. ఇక నవంబర్‌10న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ , 11వ తేదీన పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా రెండో సెమీఫైనల్‌ జరగనుంది. ఇక సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు నవంబర్‌ 14న మెగా ఫైనల్‌లో తలపడనున్నాయి. సాధారణంగా ఫైనల్‌కు, సెమీ ఫైనల్‌కు వెళ్లిన జట్ల నుంచి బెస్ట్ ప్లేయింగ్‌ ఎలెవెన్ ఎంపిక చేయడం సహజం. అయితే ఇక్కడ మాత్రం సూపర్‌ 12లో ఎలిమినేట్‌ అయిన జట్ల నుంచి బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో ఎవరు చోటు దక్కించుకున్నారో ఒకసారి పరిశీలిద్దాం.

చదవండి: టీ20 ప్రపంచకప్‌లో రికార్డులు సృష్టించిన.. కోహ్లి, రోహిత్‌.. ఇంకా

ఓపెనర్లుగా చరిత్‌ అసలంక(శ్రీలంక), కేఎల్‌ రాహుల్‌(టీమిండియా)
టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఓపెనర్‌ చరిత్‌ అసలంక దుమ్మురేపాడు. సూపర్‌ 12 ముగిసేసరికి 200కు పైగా స్కోరు సాధించిన నలుగురిలో చరిత్‌ అసలంక కూడా ఉ‍న్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 56.25 సగటుతో 225 పరుగులు చేశాడు. ఇక టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఐదు మ్యాచ్‌ల్లో 197 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌, కివీస్‌తో మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ  ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అర్థసెంచరీలతో దుమ్మురేపాడు.

మిడిలార్డర్‌: వాండర్‌ డుసెన్‌, ఎయిడెన్‌ మర్క్రమ్‌, నజీబుల్లా జర్దన్‌
జట్టుకు కీలకమైన మిడిలార్డర్‌లో దక్షిణాఫ్రికా నుంచి వాండర్‌ డుసెన్‌, ఎయిడెన్‌ మర్క్రమ్‌లు.. అఫ్గానిస్తాన్‌ నుంచి నజీబుల్లా జర్దన్‌లు చోటు సంపాదించారు. వాండర్‌ డుసెన్‌ ఐదు మ్యాచ్‌ల్లో 177 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో 94 నాటౌట్‌ మెరిశాడు. ఇక మర్క్రమ్‌ ఐదు మ్యాచ్‌ల్లో 162 పరుగులు చేశాడు. ఇక అఫ్గాన్‌ నుంచి ఎంపికైన నజీబుల్లా జర్దన్‌ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సూపర్‌ 12 దశలో ఐదు మ్యాచ్‌ల్లో 172 పరుగులు చేసిన జర్దన్‌ ఇన్నింగ్స్‌లో రెండు అర్థ సెంచరీలు ఉండడం విశేషం.

చదవండి: Virat Kohli: అందరికీ థాంక్స్‌.. ఆరోజే గనుక వస్తే క్రికెట్‌ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం

ఆల్‌రౌండర్లుగా డేవిడ్‌ వీస్‌, రవీంద్ర జడేజా, వనిందు హసరంగ
టీమిండియా నుంచి రవీంద్ర జడేజా ఐదు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ 39 సగటుతో రాణించాడు. అంతేగాక సూపర్‌ 12లో టీమిండియా ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో జడ్డూ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడం విశేషం. ఇక డేవిడ్‌ వీస్‌ నమీబియా తరపున 127 పరుగులతో పాటు మూడు వికెట్లు.. అలాగే హసరంగ శ్రీలంక తరపున బ్యాటింగ్‌లో 48 పరుగులు.. బౌలింగ్‌లో 10 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో ఒక హ్యాట్రిక్‌ కూడా ఉండడం విశేషం.

ఇక బౌలర్లుగా ముగ్గురు సౌతాఫ్రికాకు చెందిన వారినే ఎంపిక చేయడం విశేషం. డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబడ, అన్‌రిచ్‌ నోర్ట్జే ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో చోటు దక్కించుకున్నారు. రబడ, నోర్ట్జేలు ఐదు మ్యాచ్‌ల్లో ఇద్దరు కలిపి 17 వికెట్లు తీశారు. ఇందులో రబడ నుంచి హ్యాట్రిక్‌ రావడం విశేషం. ప్రిటోరియస్‌ 9 వికెట్లతో చెలరేగాడు.

బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ ఎలిమినేటెడ్‌ టీమ్స్‌:  చరిత్‌ అసలంక, కేఎల్‌ రాహుల్‌, వాండర్‌ డుసెన్‌, ఎయిడెన్‌ మర్క్రమ్‌, నజీబుల్లా జర్దన్‌, డేవిడ్‌ వీస్‌, రవీంద్ర జడేజా, వనిందు హసరంగ, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబడ, అన్‌రిచ్‌ నోర్ట్జే 

మరిన్ని వార్తలు