Avesh Khan returns home from Dubai: ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ ఆవేశ్ ఖాన్ భారత్కు తిరిగి వచ్చేశాడు. దుబాయ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. కాగా ఐపీఎల్-2021లో భాగంగా ఆవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 16 మ్యాచ్లలో 16 ఇన్నింగ్స్ ఆడి 24 వికెట్లు తీశాడు. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్(32 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
ఈ నేపథ్యంలో అతడు టీ20 ప్రపంచకప్-2021కు టీమిండియా నెట్ బౌలర్గా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 14 ఎడిషన్ ముగిసినప్పటికీ భారత జట్టుతో పాటు యూఏఈలోనే ఉండిపోయాడు. అత్యవసర పరిస్థితుల్లో జట్టులోకి తీసుకునే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే, ఏమైందో తెలియదు కానీ... ఆవేశ్ ఖాన్ ప్రస్తుతం స్వదేశానికి తిరిగి వచ్చేశాడు.
ఈ మేరకు దుబాయ్ నుంచి ఢిల్లీకి పయనమైనట్లు ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు... ఆవేశ్ ఖాన్తో పాటు నెట్ బౌలర్లుగా సెలక్ట్ అయిన కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, వెంకటేశ్ అయ్యర్, క్రిష్ణప్ప గౌతం ఇప్పటికే యూఏఈని వీడి భారత్కు చేరారు. వీరంతా.. నవంబరు 4 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు.
చదవండి: David Warner: ఓహో అక్కడే పెట్టాలా.. రొనాల్డోకు మంచిదైతే నాకూ మంచిదే కదా..