రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌

16 Feb, 2024 14:46 IST|Sakshi

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ వరుణ్‌ ఆరోన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2024లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌ తనకు చివరి రెడ్‌ బాల్‌ మ్యాచ్‌ అని వెల్లడించాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదని, అందుకే రెడ్‌ బాల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 34 ఏళ్ల వరుణ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో జార్ఖండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్‌ తన సొంత మైదానమైన కీనన్‌ స్టేడియం​లో (జంషెడ్‌పూర్‌) రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. 

2010 దశ​కంలో టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న వరుణ్‌.. 2011-15 మధ్యలో 9 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. వరుణ్‌ ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 52 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు. 2008లో ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేసిన వరుణ్‌ 65 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. వరుణ్‌ దేశవాలీ క్రికెట్‌లో జార్ఖండ్‌తో పాటు బరోడా జట్టుకు కూడా ఆడాడు. 2014 ఓల్డ్‌ట్రాఫర్డ్‌ టెస్ట్‌లో రాకాసి బౌన్సర్‌తో ఇంగ్లండ్‌ ఆటగాడు స్టువర్ట్‌ బ్రాడ్‌ ముక్కు పగలగొట్టడం ద్వారా వరుణ్‌ వెలుగులోకి వచ్చాడు. 

whatsapp channel

మరిన్ని వార్తలు