Esha Singh: స్వర్ణం నెగ్గిన తెలంగాణ షూటర్‌

14 Jan, 2023 12:33 IST|Sakshi

న్యూఢిల్లీలోని కర్ణీసింగ్‌ రేంజ్‌లో జరుగుతున్న జాతీయ షూటింగ్‌ ట్రయల్స్‌ (గ్రూప్‌-ఏ)లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ (ట్రయల్‌ 1) స్వర్ణ పోరులో ఇషా.. 16-14 తేడాతో కర్ణాటకకు చెందిన దివ్యపై అద్భుత విజయం సాధించింది. దివ్య రజతంతో సరిపెట్టుకోగా.. హర్యానాకు చెందిన యశస్విని సింగ్‌ దూస్వాల్‌కు కాంస్య పతకం దక్కింది.

మరోవైపు పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌ స్వర్ణ పతకం సాధించగా.. శివ నర్వాల్‌ రజతం, అర్జన్‌ దాస్‌ కాంస్య పతకం‍ చేజిక్కించుకున్నారు. పురుషుల 50మీ రైఫిల్‌ పోటీల (గ్రూప్‌-ఏ ట్రయల్‌ 2) విషయానికొస్తే.. అఖిల్‌ షియోరన్‌ స్వర్ణ పతకంతో మెరిశాడు. జూనియర్‌ విభాగంలో రాజస్థాన్‌కు చెందిన అమిత్‌ శర్మ (పురుషుల 10మీ ఎయిర్‌ పిస్టల్‌), చండీఘడ్‌కు చెందిన సైన్యం (మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌), మహారాష్ట్రకు చెందిన వేదాంత్‌ నితిన్‌ (పురుషుల 3P) విజేతలుగా నిలిచారు.  

మరిన్ని వార్తలు