యూకీ ఖాతాలో మూడో డబుల్స్‌ టైటిల్‌ 

30 Oct, 2023 01:26 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన బ్రెస్ట్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–జూలియన్‌ క్యాష్‌ (బ్రిటన్‌) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో యూకీ–క్యాష్‌ జోడీ 6–7 (5/7), 6–3, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ రాబర్ట్‌ గాలోవే (అమెరికా)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జంటను ఓడించింది.

గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. టైటిల్‌ నెగ్గిన యూకీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది యూకీ గిరోనా చాలెంజర్‌ టోర్నీ (స్పెయిన్‌), నొంతబురి (థాయ్‌లాండ్‌) చాలెంజర్‌ టోర్నీలో కూడా డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు.   

మరిన్ని వార్తలు