VHT 2022: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్‌.. ఈసారి భారీ శతకంతో..!

30 Nov, 2022 12:32 IST|Sakshi

Vijay Hazare Trophy 2022 Maharashtra VS Assam, 2nd Semi Final: విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో భాగంగా అస్సాంతో ఇవాళ (నవంబర్‌ 30) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి చెలరేగిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఒకే ఓవర్లో 7 సిక్సర్లు, అజేయమైన ద్విశతకంతో (220) పలు రికార్డులు బద్దలు కొట్టిన రుతురాజ్‌.. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం బాది రోజుల వ్యవధిలోనే మరోసారి విధ్వంసం సృష్టించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 126 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్‌.. 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు స్కోర్‌ చేశాడు. ఈ శతకంతో రుతురాజ్‌ ప్రస్తుత టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలు (552 పరుగులు) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో (2021, 2022) రుతరాజ్‌ గత 9 ఇన్నింగ్స్‌ల్లో  ఏకంగా 7 శతకాలు (168, 220 నాటౌట్‌, 40, 124 నాటౌట్‌, 168, 21, 124, 154 నాటౌట్‌, 136) బాది లిస్ట్‌-ఏ క్రికెట్‌లో మరో రికార్డు నెలకొల్పాడు.

అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్‌కు జతగా అంకిత్‌ బావ్నే (110) కూడా సెంచరీతో చెలరేగడంతో మహారాష్ట్ర టీమ్‌ నిర్ణీత ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. 

మరిన్ని వార్తలు